మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై లగ్జరీ స్పోర్ట్స్ కారు నడిపిన సంజుష్ స్పందించారు. జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడైన సంజుష్, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం తన వైపు వివరణ ఇచ్చారు. ఆగస్టు 16న జరిగిన ఈ దురదృష్టకర ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే.
ప్రమాదం జరిగిన వెంటనే తాను ఘటనా స్థలం నుంచి పారిపోలేదని సంజుష్ స్పష్టం చేశారు. తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని కాపాడేందుకు తన సొంత వాహనంలోనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య సాయం అందించే ప్రయత్నం చేశానని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు దక్కకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు వెల్లడించానని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నానని పేర్కొన్నారు.
మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపారా అనే కోణంలో పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షల ఫలితాలన్నీ ‘నెగెటివ్’గా వచ్చాయని సంజుష్ వెల్లడించారు. భారతి ముఖి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితురాలి కుటుంబానికి సాధ్యమైనంత మేర సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ప్రమాదానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్, వైద్య నివేదికలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సంజుష్ విజ్ఞప్తి చేశారు. మన చట్టవ్యవస్థ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న ఆయన, పోలీసుల దర్యాప్తు ద్వారా నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
